పెళ్లికి నిరాకరించిందని చంపేశాడు
తమిళనాడులో మరో దారుణం చోటు చేసుకుంది. రెండునెలల క్రితం జరిగిన టెక్కీ స్వాతి హత్య మరవకముందే కోయంబత్తూర్లో మరో ప్రేమ హత్య జరిగింది. దన్యా అనే 23 ఏళ్ల యువతి ఒంటరిగా ఇంట్లో ఉండగా జహీర్ అనే వ్యక్తి ఇంటి వెనక డోర్ నుంచి లోపలికి ప్రవేశించి కొడవలితో ఆమెను దారుణంగా నరికివేశాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు జహీర్.
ధన్యకు ఇప్పటికే వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. తను ప్రేమించిన ధన్య మరొకరికి దక్కకూడదన్న కసితో ఈ దారుణానికి పాల్పడ్డాడు జహీర్. ఘటన జరిగిన సమయంలో ధన్య తల్లిదండ్రులు షాపింగ్ చేసేందుకు బయటికి వెళ్లారు. ధన్య మెయిన్ డోర్ వేసుకున్నప్పటికీ… వెనక డోర్లోనుంచి ప్రవేశించిన జహీర్ ఆమె మెడపై కొడవలితో వేటువేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలింది.
జహీర్ ఓ మిల్లో పనిచేస్తున్నాడని..ధన్య కుటుంబ సభ్యులకు గత సంవత్సరంగా తెలుసునని పోలీసులు చెప్పారు. ధన్యను పెళ్లి చేసుకుంటానని జహీర్ ప్రతిపాదించడంతో అందుకు ధన్య తల్లిదండ్రులు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో జహీర్ను అరెస్టు చేయలేదని చెప్పారు.