పేదరికంతో జాతీయస్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య
పటియాలా: ఉచిత హాస్టల్ సదుపాయం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ జాతీయస్థాయి హ్యాండ్బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. పేదరికంతో బాధపడుతున్న తనలాంటి వాళ్లను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ లేఖ రాసి, ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పంజాబ్కు చెందిన జాతీయ స్థాయి హ్యాండ్బాల్ క్రీడాకారిణి పూజ.. పటియాలాలోని ఖల్సా కళాశాలలో చదువుతోంది. అయితే స్పోర్ట్స్ కోటా కింద ఆమెకు అడ్మిషన్తో పాటు.. మొదటి సంవత్సరం ఉచిత హాస్టల్ సదుపాయం కూడా కల్పించారు. ప్రస్తుతం ఆమె ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఈసారి ఉచిత హాస్టల్ సదుపాయం ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆమె ఇంటి నుంచి కాలేజీకి రావాల్సి వస్తోంది. ఇందుకు రోజుకు రూ.120 ఖర్చవుతోంది.
పేదరికం కారణంగా ఆమె తండ్రికి ఆర్థికభారం పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన పూజ ఆత్మహత్య చేసుకుంది. తనకు హాస్టల్ వసతి కల్పించకపోవడానికి కారణం తన కోచేనని.. అందువల్లే తాను చనిపోతున్నానని పూజ సూసైడ్నోట్లో పేర్కొంది. దీంతో పూజ తండ్రి ఆమె కోచ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఖల్సా యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. క్రీడలో వెనుకబడిపోవడం వల్లే పూజకు ఉచిత హాస్టల్ వసతి కల్పించలేదని యాజమాన్యం పేర్కొంది. పేదరికాన్ని జయించలేక క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలువురిని కలచివేసింది.