ప్రగతిపథంలో తెలంగాణ

4
– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ

మహబూబ్‌నగర్‌ ,జులై 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కొనియాడారు. కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ(ఎస్‌ఐయూ)ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ.. సింబయాసిస్‌ యూనివర్సిటీని ప్రారంభించి సందర్శించడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సూచీలో ముందున్నాయని తెలిపారు. అందుకు తెలంగాణ రాష్ట్రమే నిదర్శనమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

తెలంగాణను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్‌ అంతర్జాతీయ యూనివర్సిటీ(ఎస్‌ఐయూ) ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో 50 శాతం పైగా యువకులున్నారు. యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై సీఎం కేసీఆర్‌ సవిూక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక యూనివర్సిటీలు తెలంగాణ ఉన్నాయని చెప్పారు.టీ – హబ్‌ను ఏర్పాటు చేశాం, విద్యార్థుల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం టాస్క్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలిపారు.