ప్రజల ఆరోగ్యంపై కెసిఆర్‌ ప్రత్యేకశ్రద్ద

అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ
మాజీమంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక వ్రద్ద పెట్టిందని, అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోందని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ ప్రకియను రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల ప్రణాళికగా సిద్ధం చేస్తున్నారు. ప్రతీ మనిషిని స్క్రీనింగ్‌ చేసి ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.  రోగ నిర్దారణ అయితే స్పెషాలిటీ సేవలు అందించి, వ్యాధులను నయం చేసేందుకు కృషి చేస్తారు. అవసరమైతే దగ్గరలో ఉన్న దవాఖానలకు రిఫర్‌ చేసి వాహనాన్ని పంపించేలా ఏర్పాటు చేస్తారు. అక్కడ మెరుగైన వైద్యం అందేలా చూస్తారు. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి వాహన సౌకర్యాన్ని కల్పిస్తూ వ్యాధి నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆధార్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరిని ప్రత్యేకంగా గుర్తించి ఒక నంబర్‌ ఇస్తారు. కేటాయించిన నంబర్‌లో వారి ఫొటో, బరువు, వయ స్సు, ఆధార్‌ నంబర్‌, వ్యాధుల వివరాలను నమోదు చేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కంటివెలుగు, కేసీఆర్‌ కిట్టు, అమ్మఒడి లాంటి పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్‌ స్ధాయిలో వైద్యం అందించడానికి అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుందని, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం గా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతి వైద్యుడు రోగులకు ప్రేమానురాగాల మధ్య వైద్య సేవలు అందించాలని  అన్నారు. సమాజంలో అత్యంత మ¬న్నతమైన వృత్తి వైద్య వృత్తి అని పేర్కొన్నారు.