ప్రణబ్‌ ముఖర్జీతో ఖలీదా జియా భేటీ

ఢిల్లీ: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి భేగం ఖలీదా జియా  శనివారం నాడిక్కడ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. ఇరుగుపొరుగైన బంగ్లాదేశ్‌తో చక్కటి సంబంధాలకు భారత్‌ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రణబ్‌ముఖర్జీ ఈ సందర్భంగా ఆమెకు చెప్పారు. పరస్పర సహకారానికి సంబంధించి పుష్కలమైన అవకాశాలున్నట్లు ఆయన బేగం ఖలీదా జియాకు స్పష్టం చేశారు. గతంలో ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో తాను రెండు పర్యాయాలు సమావేశమైన సందర్భలను ప్రణబ్‌ముఖర్జీ ఈ సందర్భాంగా గుర్తు చేశారు. వారంరోజుల భారత పర్యటనకు ఆమె రావడం పట్ట ప్రణబ్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె అజ్మీరు సందర్శన గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. భారత్‌తో చక్కటి స్నేహసంబంధాలను నెలకొల్పుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఖలీదా జియా ఈ సందర్భంగా చెప్పారు.