ప్రేమికుల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ‌

శంషాబాద్‌:: (జ‌నం సాక్షి):ప్రేమ వ్యవహారంలో గొడవపడ్డ ఇద్దరు ప్రేమికుల్లో ఒకరు పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోగా అతన్ని కాపాడేందుకు యత్నించిన ప్రేమికురాలు గాయపడిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మోయినాబాద్‌ మండలం ఎల్కగూడకు చెందిన జోషికుమార్‌ అదేమండలం చిల్కూరుకు చెందిన జంగం నయోమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీ్‌సస్టేషన్‌లో ఉండే డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి బైక్‌పై బయలుదేరారు. అయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్వాసితుల కాలనీ వద్దకు రాగానే జోషికుమార్‌ బైక్‌ను ఆపి ట్యాంకులో నుంచి పెట్రోల్‌ తీసుకొని ఒంటిమీద చల్లుకొని నిప్పంటించుకున్నాడు. నయోమి అతన్ని గట్టిగాపట్టుకొని మంటలు ఆర్పేప్రయత్నంలో జోషికుమార్‌తో పాటు ఆమె గాయపడింది. స్థానికులు 108 అంబులెన్సులో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులిద్దరికీ దాదాపు 30 శాతం గాయాలయ్యాయి.