బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

25న తుఫానుగా మారే అవకాశాలు
అండమాన్‌ దీవులకు విస్తరించిన నైరుతి
వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్‌మే 23 (జనంసాక్షి) :పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శనివారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
వాతావరశాఖ తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని.. 26 నాటికి పశ్చిమ బెంగాల్‌ తీరానికి తుఫాను చేరుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి.ఈ క్రమంలో తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, హన్మకొండ, జనగామ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.