బాబు సైతం ‘సామాజిక ‘ నినాదం

బీసీలకు పెద్దపీట వేస్తాడట..!
హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): బీసీలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సోమవారంనాడు చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 2014 ఎన్నికల్లో 100 సీట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు. గెలిచే సత్తా ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. మరికొందరికి నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన ఘనత టీడీపీదేనన్నారు. సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాబోయే రోజుల్లోను అదే ఆనవాయితీని కొనసాగిస్తామన్నారు. బీసీలో 138 కులాలున్నాయని, వాటిల్లో చాలా కులాల వారు నేటికీ ఎంపిటిసిగా గాని జడ్‌పిటిసిగా గాని పోటీ చేసి ఎరుగరన్నారు. అట్టివారికి రానున్న ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. ఎన్నికల్లో అవకాశం కల్పించలేని కులాలవారికి నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు.