బీహార్ ఎన్నికల్లో పాకిస్తాన్ భజన ఎందుకు?
– ఒక్క హామీ అమలు కాలేదు
– విభజించి పాలించడమే మోదీకి తెలుసు
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
పాట్నా,నవంబర్2(జనంసాక్షి): బీహర్ ఎన్నికల్లో అమిత్శా పాకిస్తాన్ భజన చేయడాన్ని రాహుల్ తప్పుపట్టారు. పాకిస్తాన్ పాటాకులు పెలుస్తుందనడాన్ని ఆయన ఆక్షేపించారు.
బీజేపీదైనా ఆరెస్సెస్దైనా విభజించి పాలించడమే వాటి అజెండా అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించాడు. ఆ రెండిటి ఆలోచన ధోరణి, సిద్ధాంతం ఒకటే అని మండిపడ్డారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించిన నేపథ్యంలో సోమవారం బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ స్పందించారు. ‘దేశం నరేంద్రమోదీని చాలా ఆశించింది. ఆయన కూడా చాలా హావిూలు ఇచ్చారు.కానీ ఒక్కటి అమలుచేయలేదు. ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మోదీ ఒక్కరే ఒంటరిగా దేశాన్ని నడపాలని అనుకుంటున్నారు. ఇది అందరి దేశం. దేశ పురోభివృద్ధికి ప్రజలందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం వారు అర్థం చేసుకుంటే చాలా మంచిది’ అని రాహుల్ అన్నారు. బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతుందని ఆ పార్టీ నాయకులందరికీ తెలిసిపోయిందని అన్నారు. తాను నితీశ్ కుమార్ను కలిశానని, తమ ఇద్దరి ఆలోచనలు ఒక్కటేనని చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం తాను నితీశ్ కుమార్తో కలిసి పనిచేస్తానని చెప్పారు.