భాగ్‌పట్‌ జైల్‌లో గ్యాంగ్‌స్టర్‌ హత్య

– జైల్‌లోనే కాల్చి చంపిన ప్రత్యర్థి
లక్నో, జులై9(జ‌నం సాక్షి) : మాఫియా డాన్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా బజరంగీ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ జైలులో సోమవారం ఉదయం ఆయన ప్రత్యర్థి చేతిలో హత్యకు గురయ్యాడు. అదే జైలులో ఉన్న మరో గ్యాంగ్‌ స్టర్‌, ప్రత్యర్థి అయిన సునీల్‌ రాఠీ అతి సవిూపం నుంచి కాల్చి చంపాడు. మున్నాను కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. మున్నా భార్య సీమ ఇటీవల మాట్లాడుతూ తన భర్తకు ప్రాణహాని ఉందని, యూపీ పోలీసుల హిట్‌ లిస్ట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. తూర్పు యూపీకి చెందిన మున్నాను ఓ కేసు నిమిత్తం ఝాన్సీ జైలు నుంచి శనివారం భాగ్‌పట్‌ జైలుకు తరలించారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థి సునీల్‌ రాఠీ చేతిలో మున్నా హత్యకు గురయ్యాడని జైళ్ల శాఖ అదనపు ఐజీ శరద్‌ తెలిపారు. జైలులోకి తుపాకి ఎలా వచ్చిందన్నదానిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు. 1990 నుంచి మున్నా ఎంతోమందిని పొట్టనపెట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఏకే 47 తదితర ఆయుధాలతో ఎన్నో హత్యలు చేసినట్టు పోలీసు రికార్డుల్లో నమోదైంది. 2012లో మున్నా అప్నాదళ్‌ టికెట్‌పై జౌన్‌పూర్‌లోని మరియాహు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. 2017లో అదే నియోజకవర్గం నుంచి ఆయన భార్య కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో శరద్‌ యాదవ్‌ చేతిలో మున్నా ఓటమి పాలయ్యాడు. కాగా, మరో డాన్‌ కమ్‌ రాజకీయవేత్త అయిన ముక్తార్‌ అన్సారీకి మున్నా కుడిభుజంలా ఉండేవాడు.
—————————–