భారత్‌ జపాన్‌ కీలక ఒప్పందాలు

5

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జనంసాక్షి):  భారత్‌ జపాన్‌ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త విూడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… భద్రత, సహకారం దిశగా రెండు కీలక అడుగులు వేశామన్నారు. తద్వారా భారత్‌లో రక్షణ రంగంంలో పెట్టుబడులు పెరగనున్నాయని తెలిపారు. అపెక్‌లో భారత సభ్యత్వానికి మద్దతిచ్చిన అబేను ప్రశంసిస్తున్నట్లు మోదీ చెప్పారు. మేక్‌ ఇన్‌ ఇండియాకు జపాన్‌ ప్రభుత్వ, ప్రైవేటు సహకారం మరువలేనిదన్నారు. ప్రపంచ ప్రగతిలో జపాన్‌లా మరే దేశం నిర్ణయాత్మక పాత్ర పోషించలేదన్నారు. జపాన్‌ సహకారంతో ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భారత ఆర్థిక కలలను జపాన్‌లా మరే మిత్రదేశం అర్థం చేసుకోలేదన్నారు. ఐరాసలో భారత శశ్వాత సభ్యత్వానికి జపాన్‌ మద్దతు ఇచ్చిందని మోదీ చెప్పారు.భారత్‌తో బుల్లెట్‌ రైలు ఒప్పందం కొత్త అధ్యాయానికి నాంది అని జపాన్‌ ప్రధాని షింజో అబే అన్నారు. భారత్‌-జపాన్‌ మధ్య పౌర అణువిద్యుత్‌పై ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. బుల్లెట్‌ రైలు, వీసా ఒప్పందాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు వివరించారు. భారత్‌లో మరిన్ని హైస్పీడ్‌ రైళ్ల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. వారణాసిలో జపాన్‌ కన్వెన్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అబే తెలిపారు. వేగంగా దూసుకెళ్లే రైళ్లు మాత్రమే కాదు.. భారత్‌ కూడా వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబే 3 రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం దిల్లీలో జరిగిన భారత్‌-జపాన్‌ వాణిజ్యవేత్తల సదస్సులో ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 12బిలియన్‌ డాలర్ల తో జపాన్‌లో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమైందన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రాజెక్క్టు జపాన్‌ చేయూతనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని మోదీ వివరించారు. ఇందుకోసం జపాన్‌ బిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించిందని ప్రధాని మోదీ అన్నారు.  తొలిసారి భారత కార్ల కంపెనీ మారుతి సుజుకీ తయారు చేసిన కార్లను జపాన్‌ ఎగుమతి చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. 12 బిలియన్‌ డాలర్లతో జపాన్‌లో  మేక్‌ ఇన్‌ ఇండియా ప్రారంభమైందని తెలిపారు. అలాగే  జపాన్‌ ప్రధాని షింజో అబే ఈ సదస్సులో నరేంద్ర మోదీపై  ప్రశంసలు కురిపించారు. మోదీ ఆర్థిక విధానాలు జపాన్‌ హై స్పీడ్‌ ట్రైన్‌లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్‌ రైలు ట్రాక్‌ కోసం రూ.98వేల కోట్ల డీల్‌, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై  ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు ఇరుదేశాలను మరింత పటిష్టం చేస్తాయన్నారు. భారత్‌-జపాన్ల వాణిజ్య సహకారం శుభపరిణామమని అబే పేర్కొన్నారు.భారత్‌- జపాన్‌ల వాణిజ్య సహకారం శుభపరిణామమన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానాలు వేగంగా అమలు చేస్తున్నారన్నారు. సురక్షిత, నమ్మదగిన విధానాలతో ప్రజలతో కలిసివెళ్తున్నారని కితాబిచ్చారు.