భార్యాపిల్లలను హతమార్చి…

కోలారు:వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని బలిగొంది. వృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు… తాలూకాలోని కామధేనుహళ్లికి చెందిన గంగప్ప(30), దీప(24) దంపతులు. వీరికి నేహ(5), ప్రీతమ్(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైన్యంలో పనిచేస్తున్న గంగప్ప, తన భార్యపిల్లలను గ్రామంలోనే వదిలి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీప తన పక్కింటిలో ఉన్న కాలేజీ విద్యార్థితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ పెద్దలు ఆమెను కొన్ని రోజుల పాటు పుట్టినింటికి(బంగారు పేట తాలూకా కీలు కొప్ప) పంపారు. మూడు రోజుల క్రితం సెలవుపై గంగప్ప వచ్చాడు. బంగారుపేటకు వెళ్లి భార్యాపిల్లలను పిలుచుకుని వచ్చాడు. తన భార్య వివాహేతర సంబంధం తెలుసుకున్న అతను శనివారం రాత్రి భార్యాపిల్లల గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రెండు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ అజయ్ హిలోరి తెలిపారు.