మండలంలో జిల్లా వ్యవసాయ అధికారుల క్షేత్ర స్థాయిలో పర్యటన

* రైతులందరూ పంట నమోదు చేసుకోవాలి
* ఈ నెల 31లోపు పిఎం కిసాన్ లో ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి
మోత్కూరు ఆగస్టు 26 జనంసాక్షి : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పంట నమోదు ప్రక్రియ జిల్లా ఇంచార్జ్ డి.డి.ఏ లలిత మోత్కూరు మండలంలోని పొడిచేడు,అనాజిపురం, మోత్కూరు గ్రామాలను శుక్రవారం సందర్శించారు. పొడిచేడు గ్రామంలో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారి జై.సైదులు నమోదు చేసిన పంట వివరాలను రైతులతో సరిపోల్చడం జరిగింది. అలాగే పంట నమోదు పూర్తి చేయవలసిందిగా సూచించారు. అనాజీపురం గ్రామంలో రోశిరెడ్డి రైతు సాగు చేస్తున్న అధిక సాంద్రత పత్తి చేనును, అదేవిధంగా మోత్కూర్ లో మర్రి మధు వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగును పరిశీలించి, దఫాలు వారీగా ఎరువులు వాడటం వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు.
*పిఎం కిసాన్ లో ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి*
 మండలంలో పి.ఎం.కిసాన్ పథకం కింద 1432 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదని వారందరూ ఈనెల 31 తేదీ వరకు దగ్గర్లోని సిఎస్సి లేదా మీ సేవ కేంద్రాల ద్వారా చేయించుకోవాల్సిందిగా కోరారు. లేనిచో పిఎం కిసాన్ పథకం కింద నిధులు వారి ఖాతాలో జమ కావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే. స్వప్న,ఏ.ఈ.ఓ లు,సైదులు, గోపీనాథ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ రమేష్,సోంబాబు, రైతులు పాల్గొన్నారు.