మట్టితో కాల్వను మూసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

జనంసాక్షి, మంథని : చెరువు మట్టితో కాల్వను మూసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మంథని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కమాన్పూర్ మండలం లింగాల గ్రామానికి చెందిన చొప్పరి నారాయణ తన వ్యవసాయ భూమిలో సంబంధిత అధికారుల అనుమతితో సుమారు 300 టిప్పుల చెరువు మట్టిని తరలించాడు. రైతు తన పొలం పక్కన ఉన్న కాలువలు సైతం మట్టిని నింపడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావుల్లోకి కాలువ నీరు వెళ్లి బావులు కూలిపోవడంతో పాటు కాలువ ఆయకట్టు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయంపై గతంలో పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు రైతు వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు.