మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
– 17 మంది మృతి
రత్లం ,అక్టోబర్ 14(జనంసాక్షి):మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. రత్లం నుంచి మాంద్సౌర్ వెళ్తున్న ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17
మంది మరణించగా… 10 మందికి గాయాలయ్యాయి. గాయాలు పాలైన వారిని, రత్లంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మొత్తం 40మందితో ప్రయాణిస్తున్న ఈ బస్సు శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు రత్లం జిల్లా నామ్లి పట్టణంలోని బారా పత్తర్ ప్రాంతాల్లోకి రాగానే లోయలోకి పడిపోయింది. లోయలో నీరు ఉండటంతో బస్సు పూర్తిగా మునిగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే సహాయక చర్యలు అందించారు. సంఘటనా స్థలంలో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ మితివిూరిన వేగమేనని గాయాలు పాలైన వారు పేర్కొంటున్నారు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లినట్టు వారు చెబుతున్నారు. డ్రైవర్ మితివిూరిన వేగంతో టైర్లు కూడా పేలిపోయినట్టు తెలిపారు. వేగంగా నడుపవద్దని అప్పటికే పలుమార్లు తాము హెచ్చరించామని, అయినా డ్రైవర్ వినలేదని చెప్పారు. ఈ బస్సు మమతా బస్సు సర్వీసుకు చెందిందని అధికారులు పేర్కొన్నారు.