మరింత పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ,జూన్‌15(జ‌నం సాక్షి):బంగారం ధర శుక్రవారం మరింత పెరిగింది. శుక్రవారం రూ.330 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.32,190కి చేరింది. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో పాటు నగల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ రోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.450 పెరిగి కిలో వెండి ధర రూ.42 వేలకు చేరుకుంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. న్యూయార్క్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ.0.24శాతం పెరగడంతో ఔన్సు 1,301.90 డాలర్లు పలికింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.32,190గా ఉంది. 99.5శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.32,040గా ఉంది.