మహారాష్ట్రకు ఐటిబిపి బిల్లు రూ. 27 కోట్లు

ఢిల్లీ: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరి అమలు  పూర్తియిన నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ళకు పైగా అతని రక్షణ బాధ్యతలు వహించిన ఇండో -టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబీపి) దళాలు ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలును ఖాళీ చేసే పనిలో పడ్డాయి.  రక్షణ సేవలను ఉపయోగించుకున్నందుకుగాను రూ. 27 కోట్లు చెల్లించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఐటిబిపి రూ. 27 కోట్లు బిల్లుపంపింది.

కేంద్ర బలగాలకు చెందిన ఈ ప్రత్యేక దళానికి అప్పగించిన నిర్ధిష్ట లక్ష్యం పూర్తవగానే వారిని వెనక్కి రప్పించి అసలు విధుల్లో చేర్చుకోవాలంటూ ఈ దళాల కేంద్ర కార్యాలయాన్ని భారత హోంశాఖ ఆదేశాలిస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐటిబిపి  దళాలను త్వరలో వెనక్కి రప్పిస్తామని పారామిలిటరీ వర్గాలు తెలియజేశారు.

జైలులో కసబ్‌ రక్షణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఐటిబిపి దళాలను మొహరించింది.. బ్యారెల్‌ గ్రెనెడ్‌ లాంఛర్ల వంటి అత్యాధునిక అయుధ సామగ్రిని ఈ దళాలు ఉపయోగిస్తాయి. కసబ్‌ను ఉంచిన జైలుపై ఎలాంటి దాడులు జరిగినా తిప్పికొట్టే సత్తా ఉన్నందున కసబ్‌ను ఉంచిన ఆర్థర్‌ జైలు రక్షణ బాధ్యతలను ఐటిబిపికే అప్పగించారు.