మార్కెట్‌లో నిత్యావసరాల ధరాఘాతం

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మళ్లీ భయపెడుతున్నాయి. ధరల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యావసర వస్తువుల కు తోడు కూరగాయలు కూడా ధరలు పెరిగి వినియోగదారులకు ఇబ్బంది పెడుతున్నాయి. ఉల్లిధరలు అమాంతంగా పెరిగాయి. ఎంతగా పెరిగాయంటే అందుకోలేనంతగా పెరిగాయి. ఈ వారం రోజుల్లో ఉల్లి ధరలు రిటైల్‌ మార్కెట్లో 50 నుంచి అమాంతంగా వంద రూపాయాల వరకు పెరిగాయి. ఉల్లి కన్నీరు పెట్టించడం మానడం లేదు. ఓ వైపు ధరలు దక్కడం లేదని ఇటీవల కర్నూలులో ఉల్లి రైతులు ఆందోళన చెందినా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుఉతన్నా పట్టించుకోవడం లేదు. అయితే ఉల్లి రైతులు ఇప్పుడు కొంత ఆశాజనకంగా ఉన్నారు. మరోవైపు కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ కూరగాయకూడా 60 కిలో తక్కువగా లేవు. ఉల్లిని ఎక్కువగా కర్నూలు నుంచే దిగుమతి చేసుకుంటారు. అక్కడ భారీ వర్షాల కారణంగా పంట కుళ్లిపోవడంతో ధరలు పెరిగాయంటున్నారు. ఇకపోతే రిటైల్‌ మార్కెట్‌లో టొమాటో ధరలు భగ్గుమంటున్నాయి. దీనికితోడు కోడిగుడ్డు ధర కూడా కొండెక్కింది. అసలే పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. చికెన్‌ ధర తగ్గడంతో కోళ్ల పెంపకాన్ని గణనీయంగా తగ్గించారు. దీనికి తోడు కోళ్లను విదేశాలకు ఎగుమతి చేయడంతో కోడిగుడ్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది.దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఉల్లి, టొమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయింది’ అని అంటున్నారు. తర్వాతి కాపు చేతికి వచ్చే సరికి సుమారు 20 రోజులకు పైగా పడుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి పోయాయి. ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగాయి. ఇలాటప్పుడు ప్రభుత్వాలు సరియైన చర్యలు తీసుకుని వినియోగదారులకు న్యాయం చేయాలి. రేట్లు పెరిగినప్పుడు ముందుగా దళారులు కొన్ని సరుకులను గిడ్డంగిలలో నిల్వ చేస్తూ ఎక్కువ రేట్లు పెరిగిన ఇలాంటి సమయాల్లో భారీ మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. లంక భూముల్లో గోదావరి నీరు ప్రవేశించి పంటలు ధ్వంసం కావడంతో కూరల ధరలకు రెక్కలొచ్చాయని ఎపిలోపి గోదావరి జిల్లాల వ్యాపారులు చెబుతున్నారు. భారీవర్షాలు కురవడంతో విరివిగా పండే క్యాప్సికం ధరలు కూడా ఆమాంతంగా పెరిగాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్‌ రూ.120 కాగా, ప్రస్తుతం రూ.180 నుంచి రూ.200 వరకూ ఉంది. దీంతో మాంసాహారం తినాలనుకున్న వారు పచ్చళ్లు, సాంబారుతో సరిపెట్టుకుంటున్నారు. టమాట, రూ.50 చిక్కుళ్లురూ.120, క్యారెట్‌ రూ.50, క్యాప్పికం రూ. 100, బెండకాయ రూ.50, దొండకాయ రూ. 50, వంకాయలు రూ.60, పచ్చిమిర్చి రూ.70, పొట్లకాయ రూ.18 నుంచి 20, సొరకాయ రూ.15 నుఉంచి 20 వరకూ ధరలు ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడడంతో కూరగాయల పంట పండలేదు. పండినా వర్షానికి కుళ్లిపోయాయి. దీంతో కోనుగోలుదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అంతేకాక మాల్స్‌ పెరగడంతో కోనుగోలుదారుల తగ్గిపోయారు. దీనికితోడు విదేశాలకు కోళ్లను ఎగుమతి చేయడంతో పాటు చికెన్‌ ధరలు పడిపోవడంతో కోళ్ల పెంపకం గణనీయంగా తగ్గింది. దీంతో కోడిగుడ్డుకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ¬ల్‌సేల్‌లో వంద గుడ్లకు గతంలో రూ.350 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.500ల వరకు చేరింది. ఈ ధర కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాకపోవడంతో వారు కూడా గుడ్ల సరఫరా చేయడంలో చేతులెత్తేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం హాస్టళ్లలో విద్యార్థులకు, అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలపై సైతం పడే అవకాశం ఉంది.రోజంతా కష్టపడి పనిచేసిన కూలి డబ్బులు కేవలం కూరగాయలు కొనడానికి సరిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. ఇలా అయితే తిండిగింజలు కూడా కొనలేం. పిల్లన్ని చదివించలేము. చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్టటికైన అధికారులు స్పందించి సరియైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇకపోతే పప్పులు,నూనెల దరలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. బియ్యం ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. కర్నూలు సోనా 55 రూపాయలకు అమ్ముతున్నారు. దనీఇకితోడు నకిలీ సరుకులు కూడా బాగా పెరిగాయి. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోవడం లేదు. మార్కెట్లో సర్కార్‌ అజమాయిషీ లేకుండా పోతున్నది. ఎపిలో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కిలో 25కు అమ్మాలని నిర్ణయించారు. ఇది కొంత మేరకు ప్రజలకు ఊరటనిచ్చేదిగా ఉంది. ఇకపోతే ధరలపై సర్కార్‌ కంట్రోల్‌ చేసే స్థితిలో లేదు. ధరల కారణంగా సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసర ధరల విషయంలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కకున్నా మార్కెట్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వీటిని కంట్రోల్‌ చేయకుటే సామాన్యులకు బతుకు భారంగా మారనుంది.

తాజావార్తలు