అక్రమంగా తరలించిన సిమెంట్‌ స్వాధీనం

 

 

 

 

 

జనం సాక్షి రామవరం, నవంబర్ 06 : పనుల కోసం కేటాయించిన సిమెంట్‌ను అక్రమంగా తరలించడాన్ని గుర్తించిన‌ సింగరేణి కార్పొరేట్ ఎస్ అండ్ పిసి సిబ్బంది స్వాధీనం చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కాంట్రాక్ట్‌ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌కి సింగరేణి సంస్థ పనులు చేపట్టేందుకు సిమెంట్ సరఫరా చేస్తుంది. అలా సరఫరా చేసే సిమెంట్‌ బయటి మార్కెట్ ధర కంటే తక్కువగా కాంట్రాక్టర్‌కు ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు బినామీ కాంట్రాక్టర్ సిమెంట్ కట్టలను కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న స్పెషల్ పార్టీ రైడ్ చేసింది. సిమెంట్ కట్టలను ఎస్ అండ్ పిసి సిబ్బందికి స్వాధీన పరిచింది. సింగరేణి విజిలెన్స్అధికారులు సిమెంట్‌ ఎక్కడ నుండి వచ్చింది, ఎవరి పేరు మీద డ్రా అయింది, వీరికి కేటాయించిన సిమెంట్‌ను వాడకుండా నాసిరకం పనులు ఏమైనా చేపట్టి మిగిలిన సిమెంట్‌ను అమ్ముకున్నారా? తదితర విషయాల‌పై దర్యాప్తు చేప‌ట్టారు. ఈ రైడ్‌లో జమేదార్ వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, ఇంటలిజెన్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.