ముందు పునరావాసం కల్పిచండి
– తర్వాతే కూల్చండి
– ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
పునరావాసం కల్పించాకే కూల్చండి
న్యూఢిల్లీ,డిసెంబర్14(జనంసాక్షి): ప్రజలకు పునరావాసం కల్పించాకే అక్రమ కట్టడాల కూల్చివేతకు వెళ్లాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరారు. ఢిల్లీలోని శకూర్
బస్తీలో ఈ శనివారం అక్రమకట్టడాలు, దుకాణాల కూల్చివేతకు రైల్వే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి మృతి చెందడంతో రైల్వే తీరుపై ఎల్లెడలా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటి అయ్యారు. దాదాపు 30 నిమిషాలపాటు భేటి అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మట్లాడుతూ పునరావాసం కల్పించకుండా ఎక్కడా కూల్చివతేకు వెళ్లకూడదని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఒకవేళ రైల్వే ప్రాజెక్టుల కోసం
భూమి కావాలంటే అందుకు సంబంధించిన వివరాలతో తమకు సమాచారం ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఆయాప్రాంతాల్లోని ప్రజలకు పునరావాసం కల్పిస్తుందని, ఆ తార్వత రైల్వే తనపని చేసుకోవచ్చని అన్నారు. దీనికి రైల్వే మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. వచ్చే మూడునాలుగేళ్లలో రైల్వే చేపట్టబోయే అభివృద్ధి పనుల జాబితాను ఇవ్వనుందని,
దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు మొదట తాము పునరావాసం కల్పించి వారిని అక్కడినుంచి తరలించిన తర్వాత రైల్వేకు ఆ భూములను అప్పగిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ విధానం ప్రకారం అందరికీ ఇళ్లు కట్టించి పునరావాసం కల్పిస్తామని కేజ్రీవాల్ వివరించారు.