మైనార్టీ, బడుగుల సంక్షేమానికి సర్కారు..

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి): బడుగు, బలహీన, మైనారీటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మైనారీటీల అభివృద్ధిసంక్షేమంపట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు కొనసాగుతుందని ఆయన అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మాట్లాడుతూ బీసీలు, మైనారీటీలపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కపటప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. బీసీల అభ్యున్నతికి ఎక్కువ బడ్జెట్‌ కేటాయించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. కల్లు గీత కార్మికుల సమస్యలపై త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సమావేశంలో వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఐదేళ్ళకొకసారి వచ్చే ఎన్నికల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు తాము చేయడం లేదన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమన్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.