మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.

– టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి మణిరాం సింగ్.
ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్టీయుసి నాయకులు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్టియుసి కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఠాకూర్ మణిరాం సింగ్ మాట్లాడుతూ భూపాలపల్లి కేటీకే 18 ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదానికి ప్రకాష్ అనే మైనింగ్ సర్దార్ నుబలి చేశారని ఆరోపించారు. ప్రమాదానికి ఇతనికి సంబంధం లేకున్నా అతన్ని బాధ్యునిగా చేస్తూ సింగరేణి యజమాన్యం క్రమశిక్షణ చర్యల పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. మైనింగ్ సిబ్బంది బొగ్గు ఉత్పత్తి రక్షణ చర్య లో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని యజమాన్యం వేధింపులకు గురి చేయడం అన్యాయం అన్నారు. మైనింగ్ సిబ్బందిచే సాఫ్ట్ వేర్ కం సర్దార్ గా రెండు పనులు చేయించడం, విత్ డ్రాయింగ్, ఎస్డిఎల్ యంత్రాల దగ్గర ఒకే సర్దారుచే పనులు చేయించడం వలన పని ఒత్తిడితో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యజమాన్యం ఈవిధంగా వేధింపులకు గురి చేయడం అన్యాయమని తక్షణమే డిస్మిస్ ఉత్తర్వులను సింగరేణి యజమాన్యం ఉపసంహరించుకొని గని మేనేజర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. గని ప్రమాదానికి మైనింగ్ సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ తీసుకున్న తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని, మైనింగ్ సర్దార్ ను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల మైనింగ్ సిబ్బందిని ఏకం చేసి సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈసమావేశంలో నాయకులు గద్దెల నారాయణ, వెంబడి రాములు, సిరికొండ కనకయ్య, జీవరత్నం, బొల్లు మల్లయ్య, రమేష్, ఎండి హసన్, సదానందం, భాష తదితరులు పాల్గొన్నారు.