మోదీని నిద్ర పోనివ్వను
– కేజ్రీవాల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (జనంసాక్షి):దేశ రాజధానిలో ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం ఘటనలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసింగ్ను పర్యవేక్షిస్తున్న కేంద్రం నిర్లక్ష ధోరణిపై ఆయన నిప్పులు చెరిగారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే తాను ప్రధానమంత్రిని ప్రశాంతంగా నిద్రపోనివ్వనని కేజ్రీవాల్ హెచ్చరించారు. దేశ రాజధానిలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, చేతకానిపక్షంలో శాంతిభద్రతల విషయాన్ని ఒక ఏడాదిపాటు తనకు వదిలి చూడండని ప్రధానిని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్తో భేటీ అయ్యారు. అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.’ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలో ఉన్నది పూర్వపు షీలా దీక్షిత్ సరార్ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అత్యాచారాలు జరుగుతుంటే నేనింకా నిశ్శబ్ధంగా ఉండలేను. ఇప్పటికైనా తగిన భద్రతా చర్యలు చేపట్టకుంటే ప్రధానమంత్రి మోడీని ప్రశాంతంగా నిద్రపోనివ్వను. ఇది మాత్రం ఖచ్చితమని చెప్పగలను’ అని కేజ్రీవాల్ చెప్పారు.