రగిలిన గుండెలతో ” క్విట్ ఇండియా” సంగ్రామం
స్వాతంత్ర్య కాంక్షను ప్రకటించిన ఉద్యమం
* 13 -15 వరకు
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేద్దాం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
రగిలిన గుండె మంటలతో “విజయమో- వీర స్వర్గమో” అనే నినాదంతో క్విట్ ఇండియా సంగ్రామం కు నాంది పలికిందని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, బ్రిటిష్ వారి నిష్క్రమణకు నాంది పలికిందని, ప్రజలే ముందుండి నడిపిన తొలి స్వాతంత్ర పోరాటం అని పేర్కొన్నారు. ప్రజల స్వాతంత్ర కాంక్షను ప్రకటించిన పోరాట ఉద్యమమే క్విట్ ఇండియా అని తెలిపారు. ఆజాధి కా అమృత్ మహోత్సవ్ అభియాన్ లో భాగంగా క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ, ఆజాది క అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా క్విట్ ఇండియా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాల పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా దేశభక్తిని
గడప గడపకూ, వాడవాడలా తెలియజేసేలా ఈనెల 13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరిపై ఉందని, భారతావని ఘనకీర్తిని చాటడానికి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమ విషయాలను ప్రజలకు తెలియజేసి చైతన్య పరచడానికి కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు .
మాతృదేశానికి విముక్తి కల్పిద్దాం. లేదా ఆ క్రమంలో ప్రాణాలను వదిలేద్దాం నిరంతరం బానిసత్వంలో మగ్గిపోవడానికి ఏమాత్రం అంగీకరించవద్దని క్విట్ ఇండియా ఉద్యమానికి నాందిగా మహాత్మా గాంధీ సమర శంఖం పూరించారని తెలిపారు. బ్రిటిషర్లకు చరమగీతం పాడి , భరతమాతకు విముక్తి కలిగించి జాతీయ ఉద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్ ఇండియా ఉద్యమమేనని వివరించారు. అదొక ఉద్యమం కాదు జన ఉప్పెన, బ్రిటిష్ అరాచక పాలనలో కుతకుతలాడుతున్న భారతీయులు చావో రేవో అంటూ గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఉవ్వెత్తుతున్న పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టం ఇది అన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించేనాయకుడు ,దిశా నిర్దేశం చేసే మార్గదర్శకులు ఎవరు అప్పటికి అందుబాటులో లేరని , దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై కదం తొక్కిన చారిత్రక సంగ్రామం క్విట్ ఇండియా ఉద్యమమని , భారత స్వతంత్ర ఉద్యమంలో ఇదో మైలురాయిలుగా నిలిచిందన్నారు. క్విట్ ఇండియా పోరాటాన్ని ఉదృతం చేయడంతో, ఐదేళ్లు తిరిగేసరికి దేశానికి స్వతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్, సాయిని మల్లేశం, బిజెపి మీడియా కన్వీనర్ కటకం లోకేష్,జెల్లా సుధాకర్, ఊగిలె సుధాకర్, యం.డి జమాల్, బల్బీర్ సింగ్, ధర్మారం వెంకటస్వామి, మురళి,కచ్చు రవి, నరహరి లక్ష్మారెడ్డి, ఆవుదుర్తి శ్రీనివాస్, పాదం శివరాజ్, సత్యనారాయణ, మామిడి రమేష్, గున్నల కన్నాంబ,జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, జోన్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.