రాజీవ్‌ గాంధీ తరహాలో మోదీని చంపేద్దాం!

ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను గుట్టురట్టు చేసిన పుణె పోలీసులు
పూణె, జూన్‌8(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పుణె పోలీసులు గుట్టురట్టు చేశారు. దీంతో వాళ్లకు మోదీ హత్య గురించి వేసిన ప్రణాళికలు తెలిశాయి. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని హత్య చేసిన తరహాలోనే.. ప్రధాని మోదీని కూడా టార్గెట్‌ చేయాలని మావోలు ఓ లేఖలో విశ్లేషించారు. మోదీ పాలనను అంతం చేయాలని కామ్రేడ్లు ప్రతిపాదన చేశారని, రాజీవ్‌ గాంధీని హతమార్చినట్లుగా ప్లాన్‌ వేయాలని, మనం విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా, దానిపై మరింత వర్క్‌ చేయాల్సిన పని ఉందని, రోడ్‌షో సమయంలో మోదీని టార్గెట్‌ చేయడం ఉత్తమం అని మావోలు ఓ లేఖలో అభిప్రాయపడ్డారు. కామ్రేడ్‌ ప్రకాశ్‌కు వందనాలు తెలుపుతూ మిగతా మావోలు లేఖ రాసినట్లు తెలుస్తోంది. కామ్రేడ్‌ కిషన్‌తో పాటు ఇతర కామ్రేడ్లు ఈ లేఖను రాశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఆ లేఖను రాసినట్లు పోలీసులు చెబుతున్నారు.
మోదీని హతమారుస్తాం.. భారత్‌ను విచ్ఛిన్నం చేస్తాం..
ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉద్‌ దవా మితివిూరుతున్నది. నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన సభ్యులు భారత్‌ గురించి దారుణంగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని హతమారుస్తామని, ఆ తర్వాత భారత్‌ను విచ్చిన్నం చేస్తామని జమాత్‌ ఉద్‌ దవా సభ్యుడు మౌలానా బాషిర్‌ అహ్మద్‌ ఖాకి పేర్కొన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు చెందిన జమాత్‌ సంస్థ పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్నది. శుక్రవారం జరిగిన ప్రార్థనల అనంతరం సమావేశంలో పవిత్ర రంజాన్‌ మాసంలో.. జిహాదీ యుద్ధాన్ని ప్రకటించాలని మౌలానా బాషర్‌ పిలుపునిచ్చాడు. జిహాద్‌కు రంజాన్‌ మంచి సమయం అని, జీహాదీలో ప్రాణాలు కోల్పోతే, స్వర్గానికి వెళ్తారని అన్నాడు. కశ్మీర్‌లో భారత భద్రతా దళాలతో జమాత్‌ ఉద్‌ దవా సభ్యులు జిహాదీ కొనసాగిస్తున్నారని, కశ్మీర్‌ స్వేచ్ఛ కోసం, భారత్‌ను నాశనం చేయాలన్న లక్ష్యంతో వాళ్లు పనిచేస్తున్నట్లు బాషర్‌ తెలిపాడు. జమాత్‌ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ గత ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు హౌజ్‌ అరెస్టులో ఉన్నాడు.