రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌తో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ భేటీ


అరగంట పాటు వివిధ అంశాలపై చర్చ
ఫోర్త్‌ సిటీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ
పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ సానుకూలత
న్యూఢల్లీి,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కిడికి వెళ్లినా తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం గా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో ఆయన సక్సెస్‌ అవుతున్నారు కూడా. రెండు రోజుల పర్యటన లో భాగంగా ఢల్లీికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌తో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ మిస్టర్‌ యంగ్‌ లియు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోనూ సమావేశమయ్యారాయన.తెలంగాణలో నాలుగో సిటీని ఏర్పాటు చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే హైదరాబాద్‌, సికింద్రాబా ద్‌, సైబరాబాద్‌ ఉండగా, ముచెర్లలో నాలుగో సిటీకి ప్లాన్‌ చేస్తున్నారు. అక్కడ స్పోర్ట్స్‌ మాత్రమే కాకుండా ఐటీ, హెల్త్‌ విభాగాలను రప్పించేందుకు ప్రణాళికలు రచించారు. అమెరికా, కొరియా టూర్‌లో కొత్త సిటీ గురించి రేవంత్‌ టీమ్‌ చెప్పడం, తాను పర్యటనకు వస్తామన్నారు అక్కడి వ్యాపారవేత్తలు.రెండురోజుల టూర్‌లో భాగంగా ఢల్లీికి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో ఆయనతో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ మిస్టర్‌ యంగ్‌ లియు సమావేశమయ్యారు. ఫోర్త్‌ సిటీ ఏర్పాటు గురించి ఆయనకు వివరించారు. ఈ విషయంలో మీ విజన్‌ అద్భుతంగా ఉందన్నారు యంగ్‌. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తంచేశారు. ఇండస్ట్రీస్‌, సర్వీస్‌ సెక్టార్లు విస్తరణకు అపారమైన అవకాశాలు ఉండడంతో త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం తర్వాత ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యుంగ్‌ లియు, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పెట్టుబడుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై రాహుల్‌ ట్వీట్‌ చేశారు. యంగ్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందని, సాంకేతిక ఆవిష్కరణలపై తాము చర్చలు జరిపామన్నారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది. 1200 కోట్ల రూపాయలతో రంగారెడ్డి జిల్లా కొంగర కొలాన్‌లో ప్లాంట్‌ నెలకొల్పింది. ప్లాంట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నెల లేదా రెండు నెలల్లో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా తొలి ఏడాదిలో 25వేల మంది ఉపాది అవకాశాలు వస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.