రెవెన్యూ వ్యవస్థను నాశనం చేస్తున్న కెసిఆర్‌

విఆర్‌ఎల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ప్రవీణ్‌ కుమార్‌

యాదాద్రి భువనగిరి,అగస్ట్‌6( జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో దళితుల భూములు తీసుకొని వారిని ఆగం చేసిండని విమర్శించారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో సమ్మె చేస్తున్న విఆర్‌ఎల దీక్షా శిబిరానికి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ 2014లో 50 ఎకరాలు ఉన్న కేసీఆర్‌ భూములు ఇప్పుడు 300 ఎకరాలకు ఎలా పెరిగాయని ఆరోపించారు. జీఓ 111 ఎందుకు తొలగించారు..? ఇప్పుడు ఆ భూములు ఎవరి పరం అయ్యాయి ? అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. మగ్ర కుటుంబ సర్వే చేయించి ఏయే గ్రామాల్లో అసైన్డ్‌ భూములు ఉన్నాయో తెలుసుకుని అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఎస్పీ పార్టీ పోటీ చేస్తుందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.