రేపిస్ట్ను కొట్టిచంపిన జనం
దిమాపూర్: నాగాలాండ్లో మహిళపై అత్యాచారం జరగడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన సుమారు నాలుగు వేలమంది జనం ఏకంగా సెంట్రల్ జైలులోకి చొచ్చుకెళ్లారు. నిందితుడిని బయటికి లాక్కొచ్చి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అనంతరం విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన గురువారం దిమాపూర్లో జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని భావిస్తున్న సయ్యద్ ఫరీద్ఖాన్ (35) ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్. ఇరవయ్యేళ్ల నాగా యువతిపై ఫరీద్ఖాన్ గతనెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు కావడంతో ఫిబ్రవరి 25న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా ఫరీద్ఖాన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. నిందితున్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్తో సుమారు నాలుగువేల మంది గుమిగూడి గురువారం సెంట్రల్ జైలుపై దాడికి దిగారు. పటిష్ట భద్రత ఉండే జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్ఖాన్ను బయటికి తీసుకొచ్చారు. నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ ముఖ్యకూడలి అయిన సిటీ టవర్ వరకూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ పది వాహనాలకు నిప్పంటించారు. సిటీ టవర్ వద్ద ఫరీద్ఖాన్ను తీవ్రంగా కొట్టి చంపేశారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హింస ప్రబలకుండా దిమాపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించినట్లు ఎస్పీ జమీర్ తెలిపారు.