రైతుల జీవితాల్లో మరపురాని రోజు

గజ్వెల్‌ సభలో మంత్రి హరీష్‌ రావు
సిద్దిపేట,మే10(జ‌నం సాక్షి): ఈ రోజు రైతుల జీవితాల్లో మరుపురాని రోజని సిఎం నియోజకవర్గం  గజ్వేల్‌లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో మంత్రి  హరీశ్‌ రావు  అన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయన చేతులవిూదుగా కార్యక్రమం ప్రారంభమైంది. పట్టా పాసుబుక్‌లతో పాటు రైతుబంధు చెక్కులను మంత్రి హరీశ్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… . భూ రికార్డుల ప్రక్షాళణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఎకరానికి రూ.8వేల పంట పెట్టుబడి సహాయం చేస్తున్నారు. రైతు కడుపు నిండా తిని, కంటినిండా నిద్ర పోవాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. భూమి కబ్జాలో ఉన్నవారికి పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. ఇప్పుడు అసలైన లబ్దిదారులను గుర్తించి పాసుపుస్తకాలను ఇస్తున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. నిర్మల్‌ జిల్లా ఎల్లపల్లిలో రైతుబంధు పథకాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ఫలితాలు ప్రతి రైతుకు అందాలి. చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.