రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ పరిస్థితులను ఇంకా దేశం మరిచిపోలేకపోతోంది. ఈ దుర్ఘటన 300 మందిని బలితీసుకోగా.. వెయ్యి మందికిపైగా గాయాలపాలయ్యారు. పదుల సంఖ్యలో శవాలు మొన్నటి వరకు దహన సంస్కారాలకు నోచుకోక దీనంగా మిగిలిపోయాయి. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైలు డ్రైవర్ల గరిష్ట పని గంటలు 12 గంటలకు మించరాదని రైల్వే బోర్డు అన్ని రంగాలకు మార్గదర్శకం జారీ చేసింది. ఇటీవల రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు. రైల్వే కార్యకలాపాల భద్రతను పెంపొందించడానికి, సిబ్బంది డ్యూటీ టైమింగ్స్‌కు సంబంధించి దిశానిర్దేశం చేసింది రైల్వే శాఖ. ఇందులో ఒక ట్రిప్‌ కోసం డ్రైవర్లు, సిబ్బంది టైమింగ్స్‌ 12 గంటలకు మించకూడదని సూచించారు. నిద్రమత్తులో డ్రైవింగ్‌ చేయడం, ఎక్కువ సమయం పనిచేయటం వల్ల అలసట కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తీవ్ర ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు సమాచారం. 12 గంటలు నిర్వీరామంగా డ్యూటీ చేయటం వల్ల, పని సమయంలో డ్రైవర్లకు భోజనంతో పాటు విశ్రాంతి తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. దేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశా రైలు ప్రమాద సంఘటన కూడా ఒకటి. ఒడిశా రాష్ట్రం బహనాగ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. జూన్‌ 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. 4 నెలల తర్వాత 28 గుర్తుతెలియని మృతదేహాలు దహనం చేశారు. 296 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు ప్రమాదంలో జూన్‌ 2న 28 మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ శవాలను కార్పొరేషన్‌ మహిళా వాలంటీర్లు దహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగిన నాలుగు నెలల పాటు ఈ మృతదేహాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లేందుకు రాకపోవడంతో ఇక్కడి ఎయిమ్స్‌ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. అయితే ఈ 28 మృతదేహాలను ఎవరూ అంగీకరించకపోవడంతో, సీబీఐ ఆదేశాల మేరకు వారి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.