లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. సోమవారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంపై విమర్శలు చేయడం ద్వారా సీమాంధ్రలో నాయకుడిగా ఎదగాలని లగడపాటి భావిస్తున్నారని రాజయ్య అన్నారు. లగడపాటి మానసిక స్థితి సరగి లేకపోతే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. లగడపాటిపై గతంలోనూ పీసీసీకి ఫిర్యాదు చేశామని మరోమారు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రాంతాలపై వ్యాఖ్యలు చేయొద్దని ఆయన లగడపాటికి హితవు పలికారు. గతంలో ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.