వడ్డీరేట్లు పెరిగాయి!

– వడ్డీరేట్లను స్వల్పంగా పెంచిన ఎస్‌బీఐ
– వాహన కొనుగోలుదారుల నెత్తిన మరో పిడుగు
ముంబయి, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. గృహ, వాహన, ఇతర రుణాలపై ఈ భారం పడనుంది.  రుణాలపై వడ్డీరేటు 0.2 శాతం పెంచుతున్నట్లు శనివారం ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. పెంచిన ఈ రేట్లన్నీ శనివారం నుంచి అమలు కానున్నాయి. దీంతో ఎస్‌బీఐ ఉపాంత నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) 8.1శాతానికి చేరింది. ఇప్పటివరకు ఇది 7.9 శాతంగా ఉంది. ఒక సంవత్సర కాలపు  రుణాలపై వడ్డీరేటు8.25 శాతం నుండి 8.45 శాతానికి పెంచింది. అలాటే మూడేళ్ల కాల పరిమితి కలిగిన అన్ని రుణాలపైనా 20 బేసిన్‌ పాయింట్లను ఎస్‌బీఐ పెంచింది.   దీంతో మూడేళ్ల కాల పరిమితి కలిగిన  ఎంసీఎల్‌ ఆర్‌ 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెంచింది. మరోవైపు   సెప్టెంబర్‌ 1వ తేదీనుంచి వాహన కొనుగోలుదారులకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ మాండేటరీ చేయడంతో  కార్లు,  ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. దీనికితోడు  రుణాలపై వడ్డీరేటును కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారి నెత్తిపై ఎస్‌బీఐ  మరో పిడుగు వేసింది.