వరంగల్‌ బరిలో 23 మంది అభ్యర్థులు

2

– ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్‌

హైదరాబాద్‌ ,నవంబర్‌ 07 (జనంసాక్షి):

వరంగల్‌ ఉప ఎన్నిక బరిలో 23 మంది నిలిచారు. ఈ నెల 21 పోలింగ్‌ జరుగనుండగా  నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారంతో  నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిందని, ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌  పేర్కొన్నారు. వరంగల్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. పోటీకి 38 నామినేషన్లు దాఖలు కాగా,  8 నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు. మరో 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వివరించారు. 21న పోలింగ్‌,  24న కౌంటింగ్‌ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా వరంగల్‌ జిల్లాలో భారీ నిఘా పెంచామని ఆయన వివరించారు.  ఉప ఎన్నికకు రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగిస్తున్నా మని… బ్యాలెట్‌పై అభ్యర్థి ఫొటో, గుర్తు ఉంటుందని వివరించారు. ఎన్నికల్లో నోటాకు అవకాశం కల్పిస్తున్నట్లు భన్వర్‌లాల్‌ చెప్పారు. అంతేకాకుండా  లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తామని భన్వర్‌లాల్‌ వివరించారు. అభ్యర్థులు నిబంధనలు విూరి ప్రవర్తించకూడదని సూచించారు.