వరదనీటిలో చిక్కకున్న స్కూలు బస్సు

స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు

మహబూబ్‌నగర్‌,జూలై8(జనంసాక్షి): జిల్లాలో ప్రైవేటు స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మన్యకొండ రైల్వేస్టేషన్‌ దగ్గర స్కూల్‌ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల కారణంగా రైల్వే అండర్‌ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు వచ్చింది. ఇది గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు పోనిచ్చాడు. కాగా బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే వరద నీటిలో బస్సు నిలిచిపోయింది. దాదాపు సగం వరకు స్కూల్‌ బస్సు నీట మునిగింది. ఈ సమయంలో బస్సులో మొత్తం 30 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు బస్సులోని విద్యార్థులను కాపాడారు. అనంతరం బస్సును తాళ్ల సాయంతో వెనక్కి తీసుకుని వచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు రామచంద్రాపురం నుంచి సుగూర్‌గడ్డతండాకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.