విజయ్‌ మాల్యాపై ఇడి కేసు

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది. మనీల్యాండరింగ్‌ కేసు కింద ఈ అభియోగాలను దాఖలు చేశారు. అయితే భారతీయ బ్యాంకులకు కనీసం రెండు లక్షల పౌండ్లు చెల్లించాలంటూ ఇటీవలే విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ హైకోర్టు ఆదేశించింది. 13 బ్యాంకులకు ఆ సొమ్ము అందాలంటూ కోర్టు పేర్కొన్నది. స్టేబ్‌ బ్యాంక్‌ ఇండియా నేతృత్వంలోని 13 బ్యాంకులు వేసిన పిటీషన్‌ను బ్రిటన్‌ కోర్టు స్వీకరించింది. మే 8వ జరిగిన వాదనల్లో ఆ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ఆండ్రూ హెన్‌షా ఈ తీర్పును వెలువరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను ఫ్రీజ్‌ చేయాలంటూ కోర్టు ఆ తీర్పులో ఆదేశించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు జూలై 31వ తేదీన జరగనున్నాయి. తనపై నమోదు అయిన క్రిమినల్‌ ఆరోపణలు నిరాధారమైనవని మాల్యా తరపున లాయర్‌ కోర్టులో వాదించారు. భారతీయ బ్యాంకులకు మాల్యా సుమారు 9వేల కోట్లు ఎగ్గొట్టారు. ఆ కేసులో అతన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పగింత కేసులో అతను వచ్చే నెలలో వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్టేట్ర్‌ కోర్టు ముందు కూడా హాజరు కానున్నారు.