వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినా…

గుర్గామ్ : అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న29 ఏళ్ల వివాహితను బలవంతంగా కిడ్నాప్ చేసి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ముగ్గురు కామాంధులను పోలీసులు మాత్రం అరెస్టు చేయడంలో తీవ్ర తాత్సారం చేస్తున్నారు. గుర్గామ్ కు 20 కిలోమీటర్ల దూరంలోని బాద్ షాపూర్ గ్రామంలో వివాహిత తన పుట్టింట్లో పడుకొని ఉండగా ముగ్గురు దుండగులు రాత్రి 11.30 గంటలకు వచ్చి ద్విచక్రవాహనంపై ఆమెను బలవంతంగా ఎక్కించుకొని అరావళి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. వివాహితను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లేటపుడు అతని తండ్రి సెక్యూరిటీ గార్డు కావడంతో రాత్రి డ్యూటీకి వెళ్లారు. ఆమె తల్లి అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా దుండగులు వివాహితను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. తండ్రి వచ్చాక అతనితోపాటు బాధితురాలు బాద్ షాపూర్ పోలీసుస్టేషనుకు వచ్చి అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు పంపించగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 323, 365, 506, 376 డి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులను అరెస్టు చేయలేదు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని బాద్ షాపూర్ పోలీసు స్టేషను హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ మాలిక్ చెప్పారు. నిందితులు గ్రామంలోనే తిరుగుతున్నా పోలీసులు మాత్రం వారిని అరెస్టు చేయకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు నిందితులు నెలరోజుల క్రితం ఓ మహిళను వేధించినందుకు పంచాయతీ ఆదేశంతో ప్రజల ముందు క్షమాపణలు చెప్పిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయినా పోలీసులు నిందితులను పట్టుకోకపోవడంపై ఏమిటని బాధితురాలి తండ్రి ప్రశ్నిస్తున్నారు.