వెళ్లిపోడానికి సంకోచించకండి!
లాలూ పార్టీకి కాంగ్రెస్ హితవు
ఎన్నికల అనంతరం మహాకూటమి నుంచి జేడీయూ అధినేత నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల్లో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కలగజేసుకోవడంతో కూటమికి నాయకత్వం వహించిన నితీశ్నే సీఎంగా ఎన్నుకోవాల్సివచ్చింది. అయితే ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ నేత, మాజీ ఎంపీ షహబుద్దీన్.. సీఎం నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల కారణంగా మాత్రమే నితీశ్ను సీఎంను చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ మరో సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ కూడా నితీశ్పై విమర్శలు చేశారు.
దీంతో ఆర్జేడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.‘నితీశ్ నాయకత్వం ఇష్టంలేకపోతే.. ప్రభుత్వం నుంచి విడిపోడానికి ఏ మాత్రం సంకోచించకండి’ అని ఆర్జేడీని ఉద్దేశించి బిహార్ విద్యాశాఖమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చౌదరి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మాత్రం.. ప్రభుత్వంతో తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొస్తున్నారు. తమ పార్టీ నేతలు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు అర్థం కావడం లేదని, దీనిపై తమ నేతలతో మాట్లాడతానని చెప్పారు. మీడియా తమ మధ్య అభిప్రాయభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.