శ్రీవారిని దర్శించుకున్న పీయూష్‌ గోయల్‌

తిరుమల,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు కేంద్రమంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గోయల్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. యువతకు మంచి భవిష్యత్‌ ఉండాలని, పుల్వామా ఘటనలో అమరులైన సైనికుల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదొరై కూడా వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించు కున్నారు.