సంపాదన కోసమే తెరాసకు తెలంగాణ నినాదం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెరాస పై తెదేపా తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌ దయాకర్‌ రావు
తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల పేరుతో సంపాదన కోసమే మీకు తెలంగాణ
నినాదం అని ఆ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌ లో ఆయన
మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పేరిట పదవులు.డబ్బులు ఎవరు సంపాదించారో
చర్చించేందుకు రాజకీయ నేతలు ముందుకు రావాలని సవాలు విసిరారు. వచ్చే
ఎన్నికల్లో వరంగల్‌ నుంచే పోటీ చేస్తారా? అని తనపై హరీష్‌ రావు చేసిన
వ్యాఖ్యలపై మండిపడ్డారు. హరీష్‌ రావు తెరాసకు ఒక చీడపురుగుగా అభివర్ణించారు.
జిల్లా వదిలి వేరేచోట నిలబడాల్సిన గతి తనకు పట్టలేదన్నారు. కేసీఆర్‌ ఆయన
కుటుంబసభ్యులకు అలాంటి గతి పట్టిందని అన్నారు. మెరక్‌ జిల్లా వాసి అయిన
కేసీఆర్‌ కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌లలో పోటీ చేశారని.. ఇప్పుడు మరోమారు
మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేయగలరా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో పుట్టిన
హరీష్‌రావు సిద్దిపేటలో, సిద్దిపేటలో పుట్టిన కేటీఆర్‌ సిరిసిల్లలో ఎందుకు పోటీ
చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కెసీఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని
విమర్శించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.