సన్నబియ్యం కౌంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 18: మెదక్‌ మార్కెట్‌ యార్డులో జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సన్నబియ్యం కౌంటర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు గాను సన్నబియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా 10 కిలోల బియ్యం 280 రూపాయలకే పొందే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా రైస్‌బిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ బియ్యం కౌంటర్‌ను నిర్వహిస్తారని తెలిపారు. బియ్యంతో పాటు 110 రూపాయలు చెల్లిస్తే రెండుకిలోల కందిపప్పు ఇస్తారని తెలిపారు. మెదక్‌ జిల్లాలో కందిపప్పు అమ్మకం కౌంటర్‌ను జిల్లా దాల్‌మిల్స్‌ సహకారంతో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. మెదక్‌ పట్టణంతో పాటు జహిరాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డి, సిద్దిపేటలలో దాల్‌ అమ్మకం కౌంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బియ్యం కౌంటర్లను డిమాండ్‌కు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శరత్‌, జిల్లా సివిల్‌ సప్లై అధికారి ఎసురత్నం, మెదక్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి వనజాదేవి, తహశీల్దార్‌ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.