సీమాంధ్ర కాంగ్రెస్‌ దింపుడుకళ్లం ఆశ

తుస్సుమన్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సదస్సు

పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఓయూ, అడ్వకేట్‌ జేఏసీ శ్రీరాజీనామాలకు నేతలు ససేమిరా…

అధిష్టాన నిర్ణయానికి కట్టుబడాలని మెజార్టీ సభ్యుల నిర్ణయం

కేంద్ర మంత్రులు, ఎంపీల గైర్హాజరు శ్రీచివరి ప్రయత్నంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్‌, జనవరి17 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకో వాలనే సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సమై క్యాంధ్ర సదస్సు దింపుడుకళ్లం ఆశగానే మిగిలిపోయింది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో గురువారం నిర్వహించిన సమావేశం తుస్సు మంది. ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశానికి గైర్హాజరయ్యారు. గతంతో పోలిస్తే సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం మృగ్యమయ్యిందనే చెప్పాలి. సమైక్యవాద సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేగాకుండా రాజీనామాలతో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ప్రతిపాదనను
చాలామంది వ్యతిరేకించడం విశేషం. రాజీనామాలతో ఒరిగేదేమీ లేదని మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, పార్థసారథి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మంత్రి బాలరాజు కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. భేటీకి 70 శాతంమంది నేతలు హాజరుకాలేదు. చాలామంది తెలంగాణ ఏర్పడుతుందన్న విషయంలో మానసికంగా సిద్ధమయ్యారు. సగం మంది మంత్రులు కూడా హాజరు కాలేదు. డీఎల్‌ రవీంద్రారెడ్డి, మహీధర్‌ రెడ్డి, పార్థసారథి మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పార్థసారథి అన్నారు. సమాశానికి హాజరైన నేతల్లో కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. సమైక్యవాదాన్ని కేంద్రానికి వినిపించాలని కొంత మంది ప్రతిపాదించగా రాజీనామాలు చేయాలని ఒకరిద్దరు నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. రాజీనామాలతో బెదిరించడం సరికాదని, దీనివల్ల మనకే నష్టం జరుగుతుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమైక్య సమావేశం అనుకున్న మేరకు సాగలేదని భావించవచ్చు. సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కేవలం కొంతమంది పెట్టుబడిదారులు తమ వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తేటతెల్లమయింది. ఇక చాలామంది తమ స్వప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని అన్నారు.
ఓయూలో విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
సమైక్యాంధ్ర సదస్సును అడ్డుకునేందుకు ఓయూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. పోలీసులు వారిని క్యాంపస్‌ దాటి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కొంత గొడవ జరిగింది. జై తెలంగాణ నినాదాలతో క్యాంపస్‌ దద్దరిల్లింది. దీంతో కొందరిని అరెస్ట్‌ చేసి పాతబస్తీకి తరలించారు. క్యాంపస్‌ నుంచి కాకుండా బయటి నుంచి మినిస్టర్స్‌ క్వార్టర్స్‌కు చేరుకున్న విద్యార్థులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే ఎస్‌ఆర్‌ నగర్‌లోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ముట్టడించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.