సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మామునూర్‌కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జే నరసింహ సూచించారు. కృషి కల్యాణ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. రాష్ట్రంలోనే కృషి కల్యాణ్‌ అభియాన్‌ కింద మూడు జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందని అందులో కొమురంభీం అసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయని తెలిపారు. దీనిలో భాగంగా మండలంలో మచ్చాపూర్‌, బుస్సాపూర్‌, రంగాపురం, కర్లపల్లి గ్రామాలను ఎంపిక చేసి 200మంది రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.  రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సేం ద్రియ వ్యవసాయాన్ని కొనసాగించుకోవాలని సూచించారు. వేస్ట్‌ డీకంపోజర్‌తో పెట్టుబడి తక్కువ అవడంతో పాటు శాస్త్రీయ విధానంలో పంటలు సాగు చేసుకోవచ్చని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, కోళ్ల పెంపకం ద్వారా శాస్త్రీయ ఎరువులను తయారు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా ఈజీఎస్‌ పథకం కింద చేపల పెంపకానికి ప్రభుత్వ సబ్సిడీపై ఫాంపాండ్‌ నిర్మాణాలను చేసుకోవచ్చని చెప్పారు.