స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పదమూడో రోజూ తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీ, ముంబయిలో లీటరు పెట్రోల్‌పై 20పైసలు తగ్గించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధరపై 19పైసలు తగ్గించగా.. సోమవారం అత్యధికంగా చెన్నైలో 21పైసలు తగ్గింది. ఇక లీటర్‌ డీజిల్‌పై దిల్లీలో 15పైసలు, ముంబయిలో 16పైసలు తగ్గాయి. తగ్గించిన ధరల ప్రకారం దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.76.58 ఉండగా..కోల్‌కతాలో రూ.79.25, చెన్నైలో రూ.79.48, ముంబయిలో రూ.84.41కు చేరింది. డీజిల్‌ ధరలు దిల్లీలో రూ.67.95, కోల్‌కతాలో రూ. 70.50, చెన్నైలో రూ.71.73, ముంబయిలో రూ.72.35గా ఉన్నాయి.