హెగ్డేవార్ భారతమాత ముద్దుబిడ్డ
ఆర్ఎస్ఎస్ సందర్శకుల పుస్తకంలో ప్రణబ్ రాత
నాగపూర్,జూన్7(జనం సాక్షి): మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆరెస్సెస్ వ్యవస్థాపక సర్సంఘ్చాలక్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని సందర్శించారు. నాగ్పూర్లోని హెగ్డేవార్ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్లో ఆసక్తికర సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్ అని అభివర్ణించిన ప్రణబ్.. ఆయనకు నివాళులర్పించేందుకు ఇక్కడి వచ్చినట్టు తెలిపారు. ‘భారతమాత కన్న గొప్పబిడ్డ శ్రద్దాంజలి ఘటించేందుకు ఇక్కడికి వచ్చాను’ అని ఆయన విజిటర్స్ బుక్లో రాశారు. అంతకుముందు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రణబ్కు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సాదర స్వాగతం పలికారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ ఆఫీస్లో అడుగుపెట్టారు. ఆయన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత కార్యాలయం అంతా తిరిగి చూశారు. ఆరెస్సెస్ ప్రచారక్లు శిక్షణ తీసుకున్న వారికి సందేశం ఇవ్వనున్నారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ మన్నించడంపైసాక్షాత్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆగ్రహం వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారోనని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.