హెరిటేజ్ ఇప్పుడు మా ఆధీనంలో లేదు: భువనేశ్వరి
అమరావతి,డిసెంబర్10(జనంసాక్షి): హెరిటేజ్ ఫ్రెష్లో అధిక ధరలకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ.. అసెంబ్లీలో వైసిపి నేతలు చేసిన ఆరోపణలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను అసెంబ్లీ సమావేశాలను చూడను. హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు మాకింద లేదు. హెరిటేజ్ ఫ్రెష్ ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఉల్లి ధరల పెరుగుదలపై నారా భువనేశ్వరి మాట్లాడుతూ… తన జీవితంలో ఎన్నడూ ఇంత అధిక రేట్లను చూడలేదన్నారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా చొరవచూపి చర్యలు తీసుకోవాలని కోరారు. సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, క్యూలో నిలుచొని ఉల్లి కూడా కొనలేని పరిస్థితుల్లో వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.