సిరియాపై సైనిక చర్యకు నిర్ణయం : అమెరికా


వాషింగ్టన్‌, ఆగస్టు 31(జనంసాక్షి) :
ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి వేలాది మందిని అంతమొందించిన సిరియాపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. సిరియాపై చర్యలు తీసుకునే విషయమై అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం కోరతామని ఆయన చెప్పారు. సిరియా గడ్డ మీద అమెరికన్‌ సైనికుల పదఘట్టనలు వుండబోవని, సుదీర్ఘ కాలం కాకుండా పరిమితంగా చర్య చేపడతామని ఒబామా వాషింగ్టన్‌లో ప్రకటించారు. అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అమెరికా ఏం చేసినా, అది మరీ పెద్ద చర్య మాత్రం కాబోదన్నారు. మిత్ర దేశాలను, అమెరికన్‌ కాంగ్రెస్‌ను కూడా తాము సంప్రదించామని చెప్పారు. తద్వారా దాడి తప్పదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అమెరికా ఇలాంటి ప్రకటన చేయడంతో రష్యా వెంటనే స్పందించింది. బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వమే రసాయన దాడులకు పాల్పడిందనటానికి సాక్ష్యాలు అమెరికా దగ్గరుంటే, వాటిని ఐక్యరాజ్య సమితికి సమర్పించాలని సవాల్‌ చేశారు. ఆ దాడులకు వారిని బాధ్యులను చేయడం తగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెచ్చగొడితే, ఇతర దేశాలను కూడా ఈ వ్యవహారంలోకి బాధ్యులను చేయడం తగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెచ్చగొడితే, ఇతర దేశాలను కూడా ఈ వ్యవహారంలోకి లాగినట్టే అవుతుందని పుతిన్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కాదని ఏకపక్షంగా దాడి చేస్తే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని అమెరికాను పుతిన్‌ హెచ్చరించారు.