బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) :
తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించతలపెట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని ఉద్యమ సంస్థలు, విద్యా, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ సంఘాలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏపీ ఎన్జీవోలు సభ నిర్వహించినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదని తెలిపారు. ఇలాంటి సమయంలోనే మనమంతా సంయమనం పాటించాలని సూచించారు. వివాదాలకు దారి తీయకుండా శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు. ఏ చిన్న ఘటన జరిగినా సీమాంధ్రులు పెద్దగా చూపెడుతారని, అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టేందుకే సభ అన్న విషయాన్ని గుర్తించాలని జేఏసీ నేతలతో కేసీఆర్‌ పేర్కొన్నారు. టీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌ను సక్సెస్‌ చేయడం ద్వారా తెలంగాణ సత్తా చాటాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.