వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్‌ 

హయత్ నగర్, మే 12 (జనం సాక్షి): బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్-2 నందు సోమవారం రాత్రి జరిగిన వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్‌ను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సుధీర్ రెడ్డి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి సూచించారు. అద్విక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గం లో వీధి కుక్కల సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.