.ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయండి

` త్వరితగతిన భూసేకరణ చేయండి
` పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి
-అధికారులకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణ ను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.అదేవిధంగా పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయలని ఆయన సూచించారు.శనివారం రోజున డాక్టర్‌ బి.ఆర్‌.అంబెడ్కర్‌ సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని చట్టపరమైన, పాలనా పరమైన అంశాలను తక్షణమే పరిష్కరించే విదంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.ఇటు భూసేకరణ అటు పునరావాస పనులలో జాప్యం లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు.జిల్లాల వారిగా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్మాణంలో ఎదురౌతున్న ఆటంకాలను అధిగమించెందుకు అధికార యంత్రాంగం పని చేయాలన్నారు.భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో అంచనాలపై ప్రభావం చూపుతూ రెట్టింపు అబుతుందన్నారు.భూసేకరణలో ఎదురౌతున్న ఆటంకాలను అధిగమించేందుకు భూములు కోల్పయో రైతులతో సహృద్భావ చర్చలు జరపలన్నారు.నష్టపరిహారం, పునరావాసం వంటి అంశాల పై పారదర్శకంగా నిర్వహించాలన్నారు.ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రజావ్యతిరేకతతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని ,అటువంటి సునిశితమైన అంశాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు.అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణాలను ఆయన ప్రస్తావిస్తూ ఏజెన్సీ లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులను వేగవంతం చేయాలన్నారు.అదే సమయంలో పాలనా పరమైన అంశాలలో ఎటువంటి పోరాబాట్లకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.పనులలో అలసత్వం వహిస్తే అంచనాలు పెరుగు తాయన్నారు.పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.వర్షాకాలంలో సంభవిస్తున్న నీటి ప్రవహాలతో రాష్ట్రంలోని జలాశయాలలో పెరుగుతున్న నీటి మట్టాలపై ఆయన ఆరా తీశారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు నీటి మట్టాలను గమనించాలన్నారు.రాష్ట్రంలోనీ ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలలో టన్నెల్‌ నిర్మాణాలు కీలకంగా మరాయని,అటువంటి టన్నెల్‌ నిర్మాణాలలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను తెలంగాణా నీటిపారుదల శాఖలో భారత సైన్యంలో పని చేస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ నిపుణుల ను చేర్చుకోబోతున్నట్లు ఆయన వెల్లడిరచారు.భారత సేన మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ హార్బల్‌ సింగ్‌ నీటిపారుదల శాఖలో గౌరవ సలహాదారుగా,అంతర్జాతీయ స్థాయిలో టన్నెల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడిగా ప్రసిద్ది చెందిన కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా లు నీటిపారుదల శాఖల్లో చేరుటున్నట్లు ఆయన తెలిపారు.భారతదేశంలో అత్యంత క్లిష్టమైన రోహ్హ్తంగ్‌ ,జోజిలా టన్నెల్‌ నిర్మాణంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు రాజేంద్రనగర్‌ లోని వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్మెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ను మరింత బలోపేతం చెసే విదంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.సాగునీటి నిర్వహణలో శిక్షణతో పాటు పరిశోధన కు కీలక కేంద్రంగా ఉందన్నారు.అటువంటి ఇనిస్టిట్యూట్‌ కు చెందిన భూమి కబ్జాకు గురైందని తక్షణమే సర్వే జరిపి అక్రమ కబ్జాలను తొలగించాలన్నారు.సకాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ప్రజాధనాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.

సీతారామ ప్రాజక్టుకు నీటి విడుదల
` మోటర్‌కు స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌
ఖమ్మం(జనంసాక్షి):గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటు-చేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటపడి సాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించే పనులను పూర్తిచేశారు. ప్రస్తుతం గోదావరికి వరద ఉద్ధృతంగా వస్తోంది. మరో వైపు పాలేరు వద్ద అండర్‌ టన్నెల్‌ గత ఏడాది కూలిపోయింది.. దీంతో సాగర్‌ జలాలు ఖమ్మం జిల్లాలోని పంటపొలాలకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పదిరోజులు వరకు నీరు రాని పరిస్థితి. దీనివల్ల తల్లాడ, కల్లూరు మేజర్ల కింద పొలాలు ఎండిపోతున్నాయి.. దీనిని దృష్టిలో పెట్టుకొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కింద కొత్తూరు వద్ద ఏర్పాటు- చేసిన మోటార్లలో ఒక దానిని శనివారం ఆన్‌ చేశారు. దీనివల్ల గోదావరి జలాలు ఏన్కూరు వద్ద సాగర్‌ కాలువలో ప్రవేశించి తల్లాడ, కల్లూరు మేజర్ల కింద ఉన్న సుమారు 30వేల ఎకరాల్లో ఉన్న వరిపంటను రక్షించేందుకు అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేరకు మోటార్లు బిగించి ఖమ్మం జిల్లా రైతును ఆదుకోవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి అభినందనీయమని రైతులు తెలిపారు.