సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయండి: మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్
జడ్చర్ల, మే 20 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో నిలిచిపోయిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని వార్డు మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్ మున్సిపల్ కమిషనర్ ఎం గిరీష్ ను కోరారు. ఈ మేరకు బుక్క మహేష్ బుధవారం మున్సిపల్ కమిషనర్కు ఒక వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడుతూ కావేరమ్మపేట గుల్షన్ నగర్ కాలనీలోని అనిల్ ఇంటి నుండి అలిమ్ ఇంటి వరకు సి.సి. రోడ్డు నిర్మాణానికి సంబంధించి గత ఏప్రిల్ 9న పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ 25న టెండర్ ఓపెన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్, ఏఈ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అనుమతితో సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డుకు సంబంధించిన ఎర్త్ వర్క్ (మట్టి పనులు) పూర్తి చేశారని వివరించారు. అయితే, కేవలం ఎర్త్ వర్క్ మాత్రమే చేసి సిసి రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేయడం వల్ల కాలనీలో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నిలిచిపోయిన సి.సి. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు.



